హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కోసం ఆశావాహునిగా ఎదురు చూస్తున్నాడు తలసాని శ్రీనివాస యాదవ్. నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలందరూ మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రిని బుట్టలో వేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తలసాని విషయానికొస్తే ఈయన కాస్త భిన్నంగా ఏపీలో తెరాసపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు.
ఆంధ్రాలో తెరాస రాజకీయాన్ని అంతా తానై నడిపించే ప్రయత్నంలో ఉన్నారు తలసాని. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ మొదటిస్థాయి వ్యవహారాలు చేస్తుంటే ఈయన ద్వితీయస్థాయి పనులు చూస్తున్నారు. మొన్న సంక్రాంతి సీజన్లో ఏపీకి వచ్చి బాబును తీవ్రస్థాయిలో విమర్శించిన ఆయన తాజాగా విజయవాడ వచ్చి సీఎం చేపడుతున్న పథకాలన్నీ జనాన్ని మోసం చేయడానికేనని అన్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన స్వయంసహాయక సంఘాల రుణమాఫీ హామీ ఇంకా నెరవేర్చలేదని, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఏ నిబంధనల ప్రకారం ఇస్తారో చెప్పాలని అన్నారు. అంతేకాదు యాదవులతో పాటు బీసీలకు కూడా తానే న్యాయకత్వం వహిస్తానని, మార్చి 3న గుంటూరులో యాదవ బీసీ గర్జన నిర్వహిస్తానని ప్రకటించారు. తలసాని వరుస ఆంధ్రా పర్యటనలు, చేస్తున్న ఛాలెంజెస్ చూస్తుంటే ఇది ఆయన సొంత ప్రవర్తన కాదని, వెనక కేసీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.