నెల్లూరు, ఫిబ్రవరి 15: కడప, నెల్లూరు జిల్లా ప్రజలు దాదాపు వైసీపీని తప్ప ఇంకే పార్టీని అంతలా ఆదరించరు. గత ఎన్నికల్లో 7 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్ని వైకాపాకు కట్టబెట్టారు జనం. దీంతో చంద్రబాబు ఈసారి ఎలాగైనా నెల్లూరు జిల్లాలో పసుపు జెండా ఎగరేయాలని పట్టుబట్టారు.
అందుకే నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బలమైన అభ్యర్థుల్ని కూడా ఎంపిక చేసుకున్నారు. రూరల్ స్థానాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డికి, సిటీ టికెట్టును నారాయణకు ప్రకటించారు. అలాగే కోవూరు నుండి పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని దాదాపు ఖాయం చేసినట్టే అంటున్నారు.
దీంతో సిటీ స్థానంపై ఆశలు పెట్టుకున్న అబ్దుల్ అజీజ్, రూరల్ టికెట్ ఆశించిన ఆనం జయకుమార్ రెడ్డి, కోవూరు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న పెళ్లకూర శ్రీనివాస్ రెడ్డిలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమకు న్యాయం చేయకపోతే పార్టీని వీడతామనే సంకేతాలిస్తున్నారు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు వారితో చర్చలు జరిపినా వారు పూర్తిగా శాంతించలేదట. వారు గనుక మనసు మార్చుకోకపోతే టీడీపీకి వ్యతిరేక వర్గం తయారై ఈసారి కూడా మెజారిటీ స్థానాలు వైకాపా ఖాతాలోకే వెళ్ళిపోయే అవకాశముంది.