హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఏపీలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా వైసీపీ కీలక నేత, కమెడియన్ పృథ్వీ రాజ్ ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈయన జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో ప్రధాన పాత్ర పోషించాడు.
పృథ్వీ తెలుగులో దాదాపు 100 కు పైగా సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. 1986 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన 'లేడీస్ టైలర్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన పృథ్వి 2002 లో కృష్ణంవంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గం' సినిమాలో నటించి '30 ఇయర్స్ ఇండస్ట్రీ' అంటూ చేసిన కామెడీతో తన ఫేటే మారిపోయింది. ఇక వైసీపీలోకి ఈయన చేరి చాలా ఏళ్ళు అవుతుంది.