అమరావతి, ఫిబ్రవరి 16: త్వరలో ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతల వలసలతో రాజకీయవాతారణం వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల వ్యూహరచనతో ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసారు, టీడీపీ నేతలే టార్గెట్ గా జగన్ పావులు కదుపుతున్నారు.
దీంతో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు అధికం అయ్యాయి, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున సీటు రాదని భావిస్తున్న నేతలంతా వైసీపీలోకి క్యూ కట్టారు. ఇప్పటికే ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాసరావు వంటి ముఖ్యనేతలు వైసీపీలో చేరగా మరో 30మంది టీడీపీ నాయకులు వైసీపీలో చేరబోతున్నారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ క్యాడర్ అయోయమయంలో పడింది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తుంది, ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆయన పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు బుజ్జగింపు చర్యలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు కూడా పార్టీ మారతారని ఊహాగానాలు వస్తున్న తరుణంలో ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు, టీడీపీని వీడే ప్రసక్తే లేదని వివరణ ఇచ్చారు మాగుంట.
పాయకరావుపేటకు చెందిన ఎమ్మెల్సీ వంగల అనిత కూడా టీడీపీ వీడే ప్రసక్తే లేదని, ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతా అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా బాబు బుజ్జగింపులకు లొంగని కొంతమంది వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.