శ్రీనగర్, ఫిబ్రవరి 16: భారత సైనికులపై బాంబు దాడి చేసిన ఆదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆదిల్ ను భారత బలగాలు మూడేళ్ల క్రితం చితక్కొట్టడంతోనే మిలిటెంట్ గ్రూప్లో చేరాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు.
కాగా జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆదిల్ దాడి చేయగా 43 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. నిందితుడు ఆదిల్ ఓ స్కార్పియోలో సుమారు 350 కేజీల పేలుడు పదార్థాన్ని నింపుకొని సీఆర్పీఎఫ్ జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని జవాన్ల కాన్వాయ్ని ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు.
అయితే ఈ దాడిపై సూసైడర్ బాంబర్, ఆదిల్ అహ్మద్ దార్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుమారుడు చేసిన ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు, తమకు ఒకే బాధ ఉందని తెలిపారు. తన కొడుకు 2016లో స్నేహితులతో కలిసి స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా భారత సైనికులు అడ్డుకొని దారుణంగా కొట్టి హించించారని అందుకే ఆదిల్ ఉగ్రవాద గ్రూప్ల పట్ల ఆకర్షితుడయ్యాడని అతని తండ్రి తెలిపాడు.
ఇక అప్పటి నుంచి ఆదిల్ భారత సైనికుల పట్ల కోపం పెంచుకున్నాడని అతని తల్లి ఫహమీదా పేర్కొంది. అయితే తమ కొడుకు ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదని, ఈ దాడి వ్యూహం తమకు తెలియదన్నారు. కాగా గత సంవత్సరం మార్చి 19 నుంచి ఆదిల్ పని చేసే చోటు నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి కనిపించట్లేదన్నారు. అతని ఆచూకీ కోసం ఎన్నో రోజులు ప్రయత్నించి ఆశ చాలించమన్నారు.
తన కొడుకు మరణానికి దేశంలోని రాజకీయనాయకులే కారణమని, కశ్మీర్ సమస్యపై తేల్చకుండా నాన్చుతున్నారని గులామ్ అసహనం వ్యక్తం చేశాడు. కాశ్మిర్ అంశం తేలే వరకు.. తమలాంటి పేదల పిల్లలు, భారత జవాన్ల ప్రాణాలు పోతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు.