విజయవాడ, ఫిబ్రవరి 16: ఈరోజు విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు గెల్చుకుంటుందని జోస్యం పలికారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పెన్షన్ ఇస్తున్నాం, రైతుల ఋణమాఫీ చేశామన్నారు.
అలాగే అన్ని నియోజకవర్గాల్లో డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ తరుపున డబ్బులు ఇచ్చాం, అలాగే అన్ని నియోజకవర్గాలకు తాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేసాం. అందుకే 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీనే గెలుస్తుందన్నారు.
నేడు విజయవాడలో నిర్వహించిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్ ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ నదుల అనుసంధానానికి నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు దండగ అన్న ఏకైక వ్యక్తి అని విమర్శించారు.
రాయలసీమకు నీళ్లు ఇచ్చే పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించిన జగన్ కు ప్రజలు తగిన బుడ్డి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జగన్ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో జగన్ నియోజకవర్గమైన పులివెందులలో కూడా టీడీపీనే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.