ఇస్లామాబాద్, ఫిబ్రవరి 16: పుల్వామలో జరిగిన దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక భారత పౌరులు, మీడియా ఎటువంటి విచారణ జరపకుండా అందరూ పాకిస్తాన్ పై నిందలు వేయడం సరికాదని ఆరోపించింది పాక్ సర్కార్.
జమ్ముకాశ్మీర్ మూడేళ్ల మిలిటెన్సీ ఒక ఎత్తయితే జైషే మొహ్మద్ ఆధ్వర్యంలోని ఉగ్రసంస్థ ముందురోజు నిర్వహించిన ఆత్మాహుతి దాడి ఒక ఎత్తు అని తేలింది. మొత్తం దాదాపు 49 మందిని పుల్వామాలో జరిగిన దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదసంస్థకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని బుకాయించింది.
పుల్వామాలో జరిగిన దాడి తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పాక్ విదేశాంగశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ మీడియా, ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు, విచక్షణ పరిశీలనలేకుండా పాక్ హస్తం ఉందని ఆరోపిస్తుండటాన్ని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది.
పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ మాట్లాడుతూ కాశ్మీర్లోయలో ఎలాంటి హింసాత్మక చర్యనైనా తాము నిరంతరం ఖండిస్తామని, అయితే భారత్ మాత్రం పాకిస్తాన్నే నిందిస్తోందని పేర్కొన్నారు పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ప్రత్యేకంగా తమను నిందించడం సరికాదన్నారు.
పొరుగు దేశంపై విమర్శలు చేయడాన్ని నిలిపివేయాలని, ముందు ఉగ్రవాదులను తమ గడ్డపైనుంచి తరిమి వేయాలని పాక్ ప్రతినిధి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో జైషే సంస్థ ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్అజర్ను ప్రకటించాలని, నిషేధం ప్రకటించాలని భారత్ ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే.