అమరావతి, ఫిబ్రవరి 16 : ఈరోజు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత జవాన్లపై జరిగిన దాడి బాధాకరమన్నారు. జమ్మూకాశ్మిర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఉగ్రదాడిలో 43 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కోక్క అమర జవాను కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందివ్వనున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. దేశంలోని ప్రజలందరు జవాన్ల కుటుంబాలకి అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచివేయడానికి తీసుకునే ఏ నిర్ణయానికైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇక ముందు ఇలాంటివి సంఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా వ్యూహాన్ని అనుసరించాలన్నారు.