వాషింగ్టన్, ఫిబ్రవరి 16: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా మెక్సికో సరిహద్దుల్లో గోడ కోసం అమెరికన్ కాంగ్రెస్తో డొనాల్డ్ ట్రంప్ గొడవ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం పై అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని, అయినా అంతిమంగా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. 2016లో అమెరికా ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి 5.7బిలియన్ డాలర్లు కావాలంటూ ట్రంప్ పట్టుబట్టారు.
ఇటీవల ఐదు వారాల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. దీంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్ 1.4 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించింది. ఇవి ఏమాత్రం సరిపోవని, తాను కోరుకుంటున్నట్లు గోడ నిర్మాణానికి సుమారు ఎనిమిది బిలియన్ డాలర్లు అవసరమని ట్రంప్ వాదిస్తున్నారు. ఇందుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన నిధులతో పాటు తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి ఇతర నిధులను వినియోగిస్తానంటున్నారు.