న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: టీం ఇండియా సంచలన ఆటగాడు యువరాజ్ సింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 సీజన్ కు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా యువీ ఏ చిన్న మ్యాచ్ ను ఒదలడం లేదు. తాజాగా ఎయిర్ ఇండియా తరఫున ఫ్రెండ్లీ మ్యాచ్లో ఆడిన యువరాజ్ సింగ్.. మాల్దీవ్ క్రికెట్ టీమ్ స్పిన్నర్ బౌలింగ్లో కొట్టిన ‘స్విచ్ హిట్’ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక భారత్ జట్టులో గత ఏడాది చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్ ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలోనూ తొలుత అమ్ముడుపోలేదు.
కనీస ధర రూ.కోటితో వేలంలోకి వచ్చిన ఈ సీనియర్ ఆల్రౌండర్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఐపీఎల్ 2019 సీజన్కి యువీ దూరమవుతాడేమో..? అని అందరూ అనుకున్నారు. కానీ రెండో విడత వేలంలో కనీస ధరకే ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్లో ఫామ్ని చాటుకుని మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని యువీ ఆశిస్తున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది.