కర్ణాటక, ఫిబ్రవరి 19: బెంగళూరు వేదికగా జరుగుతోన్న భారత వాయుసేన విమాన విన్యాసాల్లో రెండు యుద్దవిమానాలు నేల కూలాయి. రేపటి నుండి నుంచి 24తేదీ వరకు బెంగళూరులో జరుగనున్న ఎయిరో ఇండియా విమానప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు వైమానిక దళంలో సూర్య కిరణ్ ఎయిరోబిక్స్ టీంకు చెందిన రెండు యుద్ధవిమానాలు రిహార్సల్ చేస్తున్నప్పుడు, ఆ రెండు విమానాలు గాలిలో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విమానాలు ఢీకొనగానే వాటిని నడుపుతున్న పైలెట్లు పేరాచూట్స్ సహాయంతో బయటకు దూకేశారు. వారిలో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒక పైలట్ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
విమానాలు రెండూ గాలిలో ఢీకొని కిందకు పడిపోతుంటే అంతవరకు వాటి విన్యాసాలను చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారిలో కొంతమంది ధైర్యం చేసి విమానాలు పడిన ప్రదేశానికి పరుగున వెళ్ళి గాయపడిన పైలట్లను దూరంగా తీసుకువెళ్లి రక్షించారు. రెండు విమానాలు నేల కూలగానే క్షణంలో మంటలలో కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేసి గాయపడిన పైలట్లను ఆసుపత్రికి తరలించారు.