అమరావతి, ఫిబ్రవరి 19: ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ఇప్పటికే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా మంత్రులు కాలవ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్, ఆనంద్ బాబు, ఫరూక్, కిడారి శ్రవణ్, మాణిక్యవరప్రసాద్, నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేశ్, భూమా బ్రహ్మానందరెడ్డి, కుటుంబరావు, పంచుమర్తి అనూరాధ, శోభా స్వాతిరాణి, పి.కృష్ణయ్యలను నియమించారు.
ఈ కమిటీ త్వరలోనే భేటీ కానుంది. కాగా, ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు సమాచారం. రైతులు, మహిళలు, యువతకు పెద్ద పీట వేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.