న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: క్రికెట్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత షెడ్యూల్ని ప్రకటించాలని తొలుత భావించిన బీసీసీఐ..నిర్ణయాన్ని మార్చుకుని తొలి రెండు వారాల మ్యాచ్ల షెడ్యూల్ని విడుదల చేసింది.
మార్చి 23వ తేదీన ఐపీఎల్ 2019 ప్రారంభం కానుంది. అయితే త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగుతుండడం వల్లే తొలి రెండు వారాల షెడ్యూల్ను మాత్రమే విడుదల చేశామని బోర్డు అధికారులు ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం...తొలి రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్లు జరుగుతాయి. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన తరువాతే ఐపీఎల్ 2019 తదుపరి షెడ్యూల్ను ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ తేదీ మధ్య జరగనున్న మ్యాచ్ల షెడ్యూల్ను ఐపీఎల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్ను మార్చి 24వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది. అలాగే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మార్చి 29వ తేదీన ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగుతుంది. అందులో రాజస్థాన్తో హైదరాబాద్ జట్టు తలపడుతుంది..!