న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జమ్ముకాశ్మీర్ లోని పుల్వామలో జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిపై భారత క్రికెటర్ మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వీర మరణం పొందిన జవాన్ల కోసం ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి వారికి అంకితమిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాక అమర జవాన్ల కుటుంబాలకి షమీ రూ. 5 లక్షలు విరాళం ప్రకటించాడు. భారత్ వేదికగా ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్ను టీమిండియా ఆడనుంది.
ఈ నేపథ్యంలో.. ఈరోజు మీడియాతో మాట్లాడిన మహ్మద్ షమీ.. ‘పుల్వామా దాడి వార్త నన్ను బాధించింది. సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకి తెగించి పహారా కాస్తుండటంతోనే.. మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నాం. ఇప్పుడు 40 మంది జవాన్ల కుటుంబాలు తమ పెద్ద దిక్కుని కోల్పోయాయి. కనీసం వారికి ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా నిలుద్దాం. మన కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఆ మాత్రం మద్దతుగా నిలవడం మన బాధ్యత. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి అమర జవాన్లకి అంకితమిస్తాం’ అని షమీ వెల్లడించాడు.