హైదరాబాద్, ఫిబ్రవరి 19: యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై సర్వత్రా చర్చ మొదలైంది. నాగార్జున వైసీపీలో చేరారని, గుంటూరు నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాగా తాజాగా దీనిపై నాగ్ వివరణ ఇచ్చారు. తాను వైఎస్ జగన్ ని కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. జగన్ తనకు మంచి స్నేహితుడని అందుకే కలిశానని అన్నారు.
తమ కుటుంబానికి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో స్నేహపూరిత సంబంధాలు ఉన్నాయని, అందుకే జగన్ ను కలిశానని అందులో ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పారు. కాగా తాను ఇతరుల టికెట్ కోసం జగన్ తో చర్చించేందుకు వచ్చానన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. జగన్ ఏపీలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగించుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపానన్నారు.