హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఈరోజు రాజ్ భవన్ లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. నిన్న క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు కూడా చేసారు. కాగా ఈరోజు మంత్రివర్గ విస్తరణ జరిపిన తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికి మాలినోళ్ళను మంత్రులుగా పెట్టుకున్నాడంటూ కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులు ఇవ్వరని తాను ముందే చెప్పానన్నారు.
అయితే రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విమర్శలు చెయ్యకూడదని అనుకున్నానన్నారు. కానీ తాను భయపడి విమర్శలు చెయ్యడం లేదంటూ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇకపై కేసీఆర్ చేసే తప్పులపై మాట్లాడతానని, తల తెగిపడినా సరే వదిలిపెట్టేది లేదని అన్నారు.