తెదేపా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుంది: భూమన కరుణాకర్ రెడ్డి

     Written by : smtv Desk | Tue, Aug 01, 2017, 03:38 PM

తెదేపా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుంది: భూమన కరుణాకర్ రెడ్డి

నంద్యాల, ఆగష్టు 1: నంద్యాలలో ఎన్నికల సంఘం ఉపఎన్నికలకు శంఖం పూరించిన విషయం విధితమే. అయితే ఈ నేపథ్యంలో నంద్యాల నియోజక వర్గం రణరంగాన్ని తలపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఈ ఎన్నికలకు చాలా కసరత్తు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి నంద్యాల ప్రజలకు కసి తీర్చుకునే అవకాశం లభించిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పి, జగన్ కు తొలి కానుకగా నంద్యాల విజయాన్ని ప్రజలు ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రులంతా నంద్యాలలో మకాం ఉంటున్నారు, ఓటమి భయంతోనే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలనే టార్గెట్‌గా చేసుకుని వ్యూహం ప్రకారమే దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారాయన.

నంద్యాల, తమిళనాడు ఆర్కే నగర్ కంటే దారుణంగా మారిందని భూమన విమర్శించారు. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఎవరి ఇంటికి వెళ్లినా డబ్బు దొరుకుతుందని అన్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ, దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని పక్కకు నెట్టి అవినీతి డబ్బుతో ఎన్నికలో గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. మంత్రులు సైతం తమ స్థాయిని మరచి, వీధి రౌడీలలా మారిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements