హైదరాబాద్, మార్చి 18: ఆదిత్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ......
"17రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశాం. ఇందుకు నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం మరువలేనిది. 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. మా సినిమా ట్రైలర్, వీడియోస్కు చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ఆదిత్ మాట్లాడుతూ – "ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నారని చాలా మంది అడిగారు. మాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ లేవు. రికార్డులు, రివార్డ్స్ లాంటివి కూడా లేవు. ఎవరూ చేయలేని స్క్రిప్ట్ చేయాలని అనుకుని చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్కు కాదు.. యూత్కి మాత్రమే" అన్నారు.
"ఇది ప్యూర్ అడల్ట్ మూవీ. దయచేసి ఫ్యామిలీతో వెళ్లొద్దు. ఆ విషయాన్ని ట్రైలర్లో కూడా చెప్పాం. తమిళంలోలా ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు నటుడు ‘సత్యం’ రాజేష్. ‘‘ఈ చిత్రంలో నేను కొత్తగా ఉండే పాత్ర చేశా. నన్ను నేను నిరూపించుకోవాలని చాలా కష్టపడ్డాను. ఆ పాత్రకు నాపేరు సూచించిన ‘సత్యం’ రాజేష్ అన్నకు థ్యాంక్స్" అని తాగుబోతు రమేష్ అన్నారు.