మొదటి దశ లోక్సభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ కాబోతోంది. దాంతోబాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నేడే నోటిఫికేషన్ జారీ కాబోతోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 25వ తేదీ వరకు గడువు ఉంది. ఈనెల 21 (హోలీ), 24 (ఆదివారం)నాడు నామినేషన్లు స్వీకరించబడవు. నామినేషన్లు పరిశీలన 26వ తేదీ, ఉపసంహరణకు 27 నుంచి 28 వరకు గడువు ఉంటుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి. మే 23వ తేదీన ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.