హైదరాబాద్, మార్చ్ 18: హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి సోమవారం నామినేషన్ వేశారు. అసదుద్దీన్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హైదరాబాద్ కలెక్టర్ మాణిక్రాజ్ కన్నన్కు అందజేశారు. 2009- 2014 సాధారణ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఎన్నికల అధికారులు మాట్లాడుతూ… నామినేషన్ల స్వీకరణ మార్చి 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనుండగా, నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మాత్రం ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతున్నట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు.