లక్నో, మార్చ్ 18: ఇండియా టుడే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో జెండా ఎగరవేస్తుంది అనే విషయం పై ఓ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వేలో సమాజ్వాదీ-బహుజన్ సమాజ్ పార్టీ కూటమి 40 ఎంపి స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టమైంది. అంతేకాక దేశంలో ఎక్కువ లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో ఎస్పి-బిఎస్పి కూటమి వల్ల అధికార భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నష్టపోనుందని తేలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లలో 71 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో ఒంటరిగా పోటీ చేసిన బిఎస్పి మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఎస్పి కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి.. 7 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్కి మాత్రం కేవలం రెండు స్థానాల్లో విజయం లభించింది. కాగా బిజెపిని ఎదుర్కోడానికి ఈసారి ఎస్పి-బిఎస్పిలు కలిసి బరిలోకి దిగాయి. దీంతో బిజెపి భారీగా నష్టపోనుందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే ఇండియా టుడే చేసిన సర్వే ప్రకారం ఎస్పి-బిఎస్పి కూటమికి 40 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ఓట్ షేరింగ్లో కూడా కూటమే 35 స్థానాల అనుకూలతతో ముందంజలో ఉందని, బిజెపికి కేవలం 27 స్థానాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. గత ఎన్నికల కంటే 36 స్థానాలు తక్కువగా ఈసారి 35 స్థానాలు మాత్రమే బిజెపి దక్కించుకుంటుందని పేర్కొంది. ఇతర పార్టీల గురించి తెలియజేస్తూ.. ఆర్ఎల్డికి ఒక స్థానం, కాంగ్రెస్కు నాలుగు స్థానాలు వస్తాయని ఇండియా టుడే సర్వే పేర్కొంది.