చెన్నై, మార్చ్ 19: సినీ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్కు షాక్ తగిలింది. ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యుడైన సీకే కుమారవేల్ సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత రాజకీయాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.కమల్ హాసన్ తీరుపై పార్టీలో చాలామంది సంతృప్తిగా లేరని అన్నారు. తనవరకు తానైతే కమల్ నుంచి ఏమీ ఆశించట్లేదని అందుకే పార్టీని వీడుతున్నానని చెప్పారు. ఇతరుల సంగతి తనకు తెలియదన్నారు.
పార్టీ కార్యకర్తలకు, కమల్ హాసన్కు మధ్య చాలా గ్యాప్ ఉందని.. కేవలం వాట్సాప్ మెసేజ్ల ద్వారా మాత్రమే పార్టీ నడుస్తోందని అన్నారు. మరోవైపు పార్టీ వర్గాలు మాత్రం కుమారవేల్ తీరును తప్పుపడుతున్నాయి.అధికారికంగా ధ్రువీకరించకుండానే తనను తాను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించుకోవడం పార్టీ నిబంధనలను ఉల్లంఘించడమే అని పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో కుమారవేల్ రాజీనామాను ఆమోదించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.