ఢిల్లీ, ఆగస్ట్ 8 : నరేంద్ర మోదీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. దేశంలో డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రస్తుతం ఇంటర్ వరకూ చదివిన ముస్లిం బాలికలకు రూ.12 వేల చొప్పున ఎంఏఎఫ్ఈ స్కాలర్ షిప్ లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎంఏఎఫ్ఈ, ముస్లిం బాలికల్లో ఉన్నత విద్యను ప్రోత్సహిస్తూ, 90 శాతానికి పైగా బాలికలకు ఆర్థిక సాయం చేస్తోంది. 9, 10వ తరగతి చదువుతున్న బాలికలకు రూ. 10 వేలు అవార్డుగా ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు ఎంఏఎఫ్ఈ ట్రెజరర్ షకీర్ హుస్సేన్ అన్సారీ వెల్లడించారు. ఈ 'షాదీ షగున్' పథకానికి మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (ఎంఏఎఫ్ఈ) నుండి స్కాలర్ షిప్ లను పొంది విద్యను అభ్యసిస్తున్న ప్రతి ముస్లిం బాలికా అర్హురాలే. మరిన్ని వివరాలు ఎంఏఎఫ్ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని, త్వరలోనే ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.