ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రోజు రోజుకు కొత్త కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర్రెడ్డిల కేంద్రంగా సిట్ అధికారులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు ఉపయోగించిన వేటకొడవళ్లను పులివెందుల శివార్లలోని అరటి తోటల్లో సిట్ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వేటకొడవళ్లపై ఉన్న ఫింగ్ ప్రింట్స్ను సైతం సిట్ అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉండగా, వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల రౌడీషీటర్ వివేకానందరెడ్డి ఇంటి పరిసరాల్లోనే తిరిగాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క ఆరు నెలల కిందట పులివెందులలో జరిగిన రంగమేశ్వర్రెడ్డి హత్య తరహాలోనే వివేకానందరెడ్డి హత్య జరిగినట్టు అధికారులు ప్రాధమిక నిర్దారణకు వచ్చారు. రంగమేశ్వర్ హత్య కేసులో పులివెందుల రౌడీ షీటర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన నిందితుడు. వివేకానందరెడ్డిని కూడా రంగమేశ్వర్ తరహాలోనే చంపడాన్నిబట్టి చూస్తే వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రశేఖర్రెడ్డి ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి.
బెంగళూరులో 150 కోట్లు విలువ చేసే భూ వివాదం సెటిల్మెంట్కు సంబంధించి గంగిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కోటి 50 లక్షల విషయంలోనూ గంగిరెడ్డి, పరమేశ్వర్రెడ్డితో చేతులు కలిపాడని, ఆ వివాదమే వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిందన్న వాదన వినిపిస్తోంది. అయితే, వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన వేట కొడవల్లపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితులను తేల్చేపనిలో సిట్ అధికారులు బిజీగా ఉన్నారు.