మార్చ్ 21: ఈ నెల 15న ఉదయం న్యూజిలాండ్ లోని రెండు మసీదుల్లో దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పుల ఘటనపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలో అన్ని రకాల సెమీ ఆటోమెటిక్ ఆయుధాల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఈ రోజు ఆమె ప్రకటించారు. గత వారం జరిగిన మసీదు కాల్పుల్లో 50 మంది మృతిచెందారు .దీంతో తుపాకీ చట్టాలను మార్చాలని ఆ దేశ ప్రభుత్వం భావించింది. ఏప్రిల్ 11వ తేదీ లోపు నూతన చట్టాన్ని రూపొందిస్తామన్నారు. మసీదుల్లో కాల్పులు జరిపిన అతివాద తీవ్రవాది, ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్ 2017లో న్యూజిలాండ్ నుంచి ఆయుధ లైసెన్సు పొందాడు. సైనిక ఆయుధాల తరహాలో ఉండే అన్ని సెమీ ఆటోమెటిక్ ఆయుధాలను బ్యాన్ చేస్తున్నట్లు జెసిండా చెప్పారు.