టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఉన్న అత్యున్నతమైన ఆస్తి యువతేనని అన్నారు. అందుకే వారిని ప్రోత్సహించేందుకు నిరుద్యోగ భృతి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో నిర్వహించిన రోడ్షోలో నిరుద్యోగ భృతిపై మాట్లాడుతూ... ఇప్పుడు నిరుద్యోగులకు ఇస్తున్న రూ.2వేలకు మించి ఎక్కువ భృతిని చెల్లిస్తామని ప్రకటించారు. యువతకు తానే ఓ సంరక్షుడిగా ఉంటానని..అన్నారు. అంతేకాకుండా అభివృద్ధిని అడ్డుకొనేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని, అంతేకాకుండా టీడీపీ నాయకుల ఆస్తులపై ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి వీధిలో ఒక రౌడీ తయారవుతారని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే విజయనగరం జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని.. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్లే తనకు శత్రువులని పేర్కోన్నారు.