కృష్ణా, మార్చ్ 24: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సిపి అధినేత జగన్ను హెచ్చరించారు. పులివెందుల వేషాలు తన దగ్గర వేస్తే ఊరుకునేది లేదని, పేపర్, ఛానల్ ఉన్నాయని పిచ్చి పిచ్చి రాతలు రాస్తే తాట తీస్తానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డిపైనా విరుచుకుపడ్డారు. ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానన్నారు. హైదరాబాద్లో కూర్చుని కేసీఆర్ అనుమతితో వైఎస్ఆర్సిపి బీఫారాలు ఇస్తోందని పవన్ విమర్శించారు. జిల్లాలోని కైకలూరులో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలోనే సీఎంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలు జగన్, చంద్రబాబులే చేస్తారా? తాను చేయలేనా? అని అన్నారు.