జెరూసలెం: ఇజ్రాయిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చివరి దశలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో విఫలమైంది. గురువారం ల్యాండింగ్ సమయంలో రోబోటిక్ లాండర్లోని ఇంజిన్లో సాంకేతిక లోపంతోపాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతిందని మిషన్ సిబ్బంది తెలిపారు. చంద్రని ఉపరితలానికి 15-17 కిలో మీటర్ల దూరంలో ఉండగా కుప్పకూలి ఆ దేశానికి నిరాశను మిగిల్చింది. ఇజ్రాయిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా బెర్షీట్ స్పేస్క్రాఫ్ట్ను ప్రయోగించింది. ఈ ప్రయోగానికి దాదాపు వంద కోట్లు ఖర్చు చేశారు. ప్రైవేట్ స్పేస్ అంకుర సంస్థ స్పేస్ఐఎల్, ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ స్పేస్క్రాఫ్ట్ను నిర్మించాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రనిపై సురక్షితంగా లాండర్ను దించిన నాలుగో దేశంగా ఇజ్రాయిల్ ఘనత సాధించి ఉండేది. ఇప్పటివరకు చంద్రునిపై అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సురక్షితంగా లాండర్లను దించగలిగింది.