న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతనంగా వివిధ రకాల ఎటిఎం కమ్ డెబిట్ కార్డుల సేవలందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్డులపై కూడా నగదు విత్ డ్రా పరిమితులను అమలులో ఉంచింది. ఏటీఎం క్లాసిక్ డెబిట్ కార్డు కలిగిన వారు ఏటీఎం నుంచి రోజుకు రూ.20,000 మాత్రమే తీసుకోగలరు. అలాగే పాయింట్ ఆఫ్ సేల్, ఆన్లైన్లో రూ.50,000 వరకు విలువైన ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. బ్యాంక్ ఈ కార్డు జారీకి ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. అయితే వార్షికంగా రూ.125 మెయింటెనెన్స్ చార్జీని వసూలు చేస్తోంది. దీనికి జీఎస్టీ అదనం. అలాగే కార్డు రిప్లేస్మెంట్ కోసం రూ.300 తీసుకుంటోంది. దీనికి కూడా జీఎస్టీ అదనం. ఇక ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు కలిగిన వారు ఏటీఎం నుంచి రోజుకు రూ.40,000 విత్డ్రా చేసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల పరిమితి రోజుకు రూ.75,000. ఇకపోతే ఈ కార్డుల జారీకి కూడా బ్యాంక్ ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. మెయింటెనెన్స్ ఫీజు కింద ఏడాదికి రూ.175 (జీఎస్టీ అదనం) తీసుకుంటోంది. కార్డు రిప్లేస్మెంట్ కోసం రూ.300+ జీఎస్టీ వసూలు చేస్తోంది.