మొహాలి: ఈ సీజన్లో మొదటి విజయాన్ని అందుకున్న ఆనందంలో ఉన్నరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి షాక్ ఎదురైంది. శనివారం బెంగళూరు-కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కోహ్లీసేన తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి రూ.12లక్షలు జరిమానా పడింది. దీంతో ఈ సీజన్లో కోహ్లీకి తొలి విజయంతో పాటు తొలి జరిమానా కూడా పడినట్లైంది. ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద లెక్కగడతారు. దీంతో కోహ్లీకి మ్యాచ్ ఫీజులో కోత తప్పలేదు. ఇంతకు ముందు రోహిత్ శర్మకు కూడా ఇదే తరహాలో ఫైన్ పడింది. ముంబయి ఇండియన్స్- కింగ్స్లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టు తరఫున స్లో ఓవర్ రేట్ నమోదైంది. దీంతో ఆజట్టు సారథి రోహిత్కు జరిమానా తప్పలేదు. ఇక ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేకు సైతం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు.