న్యూఢిల్లీ: రుణ ఉభిలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్ వేస్ కు మరో షాక్ తగిలింది. తమ కంపెనీ విమానాల్లో పనిచేసే 1100 పైలట్లు రేపటి నుండి విధులకు హాజరుకావడంలేదని నిర్ణయించినట్లు పైలట్స్ బాడీ నేషనల్ ఏవియేటర్ గిల్డ్ తెలిపింది. ఇప్పటివరకు వరకు పైలట్స్, ఇంజినీర్లు, సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు జెట్ ఎయిర్ వేస్ జీతాలు చెల్లించలేదు. కాగా పైలట్లకు జనవరి నుంచి సంస్థ జీతాలు చెల్లించకపోవడంతో బకాయిలను చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని పైలట్లు ప్రకటించారు. అంతేకాక వీరితోపాటు ఇతర కేటగిరి ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేదు. అందుకనే.. ఏప్రిల్ 15, ఉదయం 10గంటల నుంచి ఎన్ఏజీలోని 1,100 మంది పైలట్లు విమానాలను నడపకూడదని నిర్ణయించుకున్నట్లు గిల్డ్ వర్గాలు వెల్లడించాయి. జెట్ సంస్థలోని మొత్తం 1,600 మంది పైలట్లలో దాదాపు 1,100 మంది ఎన్ఏజీలో సభ్యులు. జెట్ ఎయిర్వేస్ నిర్వహణ బాధ్యతలను ఇప్పుడు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం చూస్తున్న విషయం తెలిసిందే. నేడు ఈ సంస్థలో స్వతంత్ర డైరెక్టర్గా పనిచేస్తున్న రాజశ్రీ పతి తన పదవి నుంచి వైదొలగారు. ఆయన రాజీనామా ఏప్రిల్ 13 నుంచే అమల్లోకి రానుంది.