న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖాన్వాడ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ సిఎం కమల్ నాథ్ బిజెపి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే....పార్లమెంట్, దేశ సైనికులపై దాడులు జరిగాయని తీవ్రంగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే దేశ భద్రత, సైన్యం విషయంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్యాంట్లు, పైజామాలు ధరించకముందే భారత సైన్యం పటిష్టంగా ఉందని మోడీకి కమల్ చురకలంటించారు. సైన్యం, వాయుసేన, నౌకాదళాన్ని మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీలు పటిష్టంగా తయారు చేశారని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వాలు ఉన్నప్పుడు సరహద్దుల వెంబడి ప్రతీ రోజూ కాల్పులు జరగడమే కాకుండ పుల్వామా, యురి ఘటనలో చోటుచేసుకున్నాయని మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సైన్యంపై ఇన్ని దాడులు జరుగుతున్నా భద్రత విషయంలో మోడీ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలలో మోడీ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని, కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైందని ప్రశ్నించారు. వంద రోజులలో బ్లాక్ మనీ తెస్తానన్నా ప్రమాణం ఎక్కడ పెట్టారని మోడీని కమల్ నాథ్ అడిగారు.