పారిస్ : పారిస్ లో 850 ఏళ్ళ పురాతనమైన ‘నోట్రే డామే కేథడ్రల్ చర్చి’ అగ్ని ప్రమదంలో కాలి బూడిదైపోయింది. ఈ దుర్ఘటనతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. నిరంతరాయంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొనివచ్చారు. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంటలు తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. చర్చిలో ఆధునికీకరణ పనులు కొనసాగుతుండగా ఒక్కసారిగా సోమవారం సాయంత్రం మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో చర్చి పైకప్పు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియా రాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 850ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కట్టడంతో ఫ్రాన్స్ ప్రజలది విడదీయరాని బంధం. ఫ్రెంచి నిర్మాణ శైలికి దీన్ని ఉదాహరణగా చూపుతుంటారు. ఫ్రెంచి విప్లవం, పారిస్ స్వాతంత్య్ర పోరాటం లాంటి పలు కీలక ఘట్టాలకు ఈ చర్చి సాక్ష్యంగా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కట్టడం ఒక్కసారిగా మంటలకు ఆహుతవుతుండడంతో దేశ ప్రజలంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.