బెంగళూరులో ఘోరం ..

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 02:37 PM

బెంగళూరులో ఘోరం ..

తనకంటే భార్యకు ఎక్కువ జీతం రావడాన్ని సహించలేకపోయాడు ఓ భర్త. దీంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హతమార్చాడు ఆ కర్కషుడు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన రావి ధనుంజయరావు, ధనలక్ష్మిల కుమార్తె జయమాధవి వివాహం విజయవాడకు చెందిన వెంకట సుబ్రహ్మణ్యంతో గత ఏడాది జరిగింది. కట్నం కింద సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.30 లక్షల డబ్బు, 30 తులాల బంగారం, ఆడపడచు లాంఛనాల కింద 2లక్షలు, అరకేజి వెండి ఇచ్చారు జయమాధవి తండ్రి. ఈ ఇద్దరు బెంగళూరులోని వేర్వేరు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. మొదట్లో వీరిద్దరి సంసారం బాగానే సాగింది. అయితే ఏమైందో తెలీదు గానీ.. ఒక్కసారిగా సుబ్రహ్మణ్యంలో మార్పు వచ్చింది.

తనకంటే జయమాధవి ఎక్కువ సంపాదిస్తుందనే ఈర్ష్య, తక్కువ కట్నం వచ్చిందన్న మనోవేదనతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల జయమాధవి గర్భవతి అయింది. అయితే ఈ విషయం తెలిసి సంతోషించాల్సిన భర్త అప్పటి నుంచి మరింతగా వేధించసాగాడు. ఈ నేపథ్యంలో శనివారం జయమాధవిని హత్య చేశాడు సుబ్రహ్మణ్యం.

విషయం తెలుసుకున్న జయమాధవి తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను చిత్రహింసలకు గురి చేసి, హత్య చేసినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మరో ఇద్దరు నిందితులైన సుబ్రహ్మణ్యం తల్లి, సోదరి పరారీలో ఉన్నారు. అయితే పెళ్లైన నాలుగో రోజు అత్తారింటికి వెళ్లిన జయమాధవి.. అప్పటి నుంచి పుట్టింటికి రాలేదు. ఇప్పుడు రక్తపు ముద్దగా ఆమె మృతదేహం పుట్టింటికి చేరడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.





Untitled Document
Advertisements