దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాతాల్లో రెండో విడత సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. దేశంలోని పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చెన్నైలో సూపర్స్టార్ రజినీకాంత్ క్యూలో నిల్చొని వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాండిచ్చేరి గవర్నర్, మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రకాష్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కమల్ హాసన్, శృతి హాసన్లు వారి వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కూడా ఓటేశారు. ఆయన కూమారుడు కార్తీ చిదంబంరం తమిళనాడులోని శివగంగ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ప్రముఖ నటుడు అజిత్, నటుడు అరుణ్ విజయ్, విజయ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో దశలో 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో 38 లోక్సభ, 18 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.