హైదరాబాద్: బుధవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నైపై హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమిపై చెన్నై కెప్టెన్ సురేష్ రైనా మాట్లాడుతూ....'ఈ ఓటమి మేల్కొలుపు లాంటిది. మేం ఇంకా పెద్ద లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించి ఉండాల్సింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కానీ అది సాధ్యం కాలేదు. డుప్లెసీస్, వాట్సన్ మంచి ఆరంభం ఇచ్చారు. కానీ, దాన్ని మేం సరిగా వినియోగించుకోలేకపోయాం. కీలకమైన సమయంలో వికెట్లు కోల్పోయాం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉంది. అనుకున్న దాని కంటే 30 పరుగులు తక్కువే చేశాం. అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే మ్యాచ్ రసవత్తరంగా ఉండేది' అని రైనా పేర్కొన్నాడు.