ముంబై : క్యాష్బాక్ రూపంలో దాదాపు పది కోట్ల రూపాయల మోసం గుర్తించడంతో చాలా మంది ఉద్యోగులను తొలగించడంతోపాటు, చిన్న మర్చంట్లను కూడా డీలిస్ట్ చేసినట్లు పేటీఎం ప్రకటించింది. క్యాష్బాక్ మోడల్ కరెక్టైనదేనని ఈ సందర్భంగా సీఈఓ విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. దివాలి తర్వాత చాలా మంది చిన్న వ్యాపారస్తులు భారీ క్యాష్బాక్స్ అందుకోవడాన్ని తమ టీం గమనించిందని, దాంతో లోతుగా పరిశీలించాల్సిందిగా ఆడిటర్లను కోరడంతో ఈ ఫ్రాడ్ బయటకు వచ్చిందని శర్మ తెలిపారు.
ఈ మోసాన్ని విచారించేందుకు కన్సల్టెన్సీ సంస్థ ఈవై సేవలను కూడా పేటీఎం ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. కిందిస్థాయిలోని కొంత మంది ఉద్యోగులతో కుమ్మక్కై కొంత మంది సెల్లర్లు అక్రమంగా క్యాష్బాక్లు పొందినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ మోసం రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చని శర్మ తెలిపారు. మోసానికి పాల్పడిన ఉద్యోగులు, వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కొంత మంది ఉద్యోగులు వ్యాపారులతో కలిసిపోయి ఫేక్ ఆర్డర్లు సృష్టించడం ద్వారా క్యాష్బాక్లు పొందినట్లు తేల్చారు.