ఢిల్లీ నుంచి మిలాన్ కు బయల్దేరిన విమానం యూఏఈలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక భారతీయ వ్యక్తి మృతి చెందడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని ఇండియన్ ఎంబసీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు . ఇక వివరాల్లోకి వెళితే మృతుడు రాజస్థాన్ కు చెందిన కైలాశ్ చంద్ర శైనీ (52) అని ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది. తన 26 ఏళ్ల కుమారుడు హీరా లాల్ తో కలసి ప్రయాణిస్తుండగా ఈ విషాదకర ఘటన సంభవించిందని తెలిపింది.
ఈ సందర్భంగా ఎంబసీ కౌన్సిలర్ ఎం.రాజమురుగన్ మాట్లాడుతూ, అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సోమవారం రాత్రి ఈ ఘటన సంభవించిందని తెలిపారు. మృతదేహాన్ని మఫ్రాక్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. పోస్ట్ మార్టం వంటి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, ఇతిహాద్ విమానంలో బాడీని బుధవారం భారత్కు పంపిస్తామని వెల్లడించారు. ఇదొక దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు.