రాజస్థాన్లో ముస్లిం కార్యకర్తలు రెండు ప్రభుత్వ వైద్యశాలలోని ప్రసూతి గదులలో గాయత్రి మంత్రం వినిపించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మకు ఫిర్యాదు చేశారు. అయితే వైద్యులు ఈ మంత్ర జపం కారణంగా పురిటి నొప్పులు పడుతున్న మహిళలకు ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ఈ ఉదంతంపై వైద్యాధికారి డాక్టర్ తేజ్ రామ్ మీణా మాట్లాడుతూ తాము జిల్లా ప్రధాన ఆసుపత్రిలో గల ప్రసూతి గదిలో గాయత్రి మంత్రాన్ని వినిపిస్తున్నామని, అలాగే మరో ఆరోగ్య కేంద్రంలోనూ దీనిని అమలు చేస్తున్నామని, మొత్తం 20 ప్రసూతి గదులలో గాయత్రి మంత్ర జపాన్ని వినిపిస్తున్నామని తెలిపారు. దీనిని వినడం వలన మహిళలకు పురిటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. తమకు గాయత్రి మంత్రం వినిపించాలని ఎవరూ చెప్పలేదని, తామే స్వతంత్రంగా గర్భిణుల మానసిక ఆరోగ్యం కోసం ఈ పని చేస్తున్నామన్నారు. అయితే ముస్లింలు దీనిపై నిరసన కొనసాగిస్తున్నారు.