టీడీపీకి మరో షాక్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 10:27 AM

టీడీపీకి మరో షాక్

మరో వారంలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది. దానికి తోడు ఆ పార్టీకి మరో షాక్ కూడా తగిలింది. టీడీపీకి చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లా రాజంపేట మాజీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి సాయిపత్రాప్‌ మళ్లీ సొంతగూటికి(కాంగ్రెస్‌లో) చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన కొద్ది కాలం క్రితం వరకు టీడీపీలో ఉండి, టిక్కెట్ రాలేదని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ నెల 16న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఎపిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సాయి ప్రతాప్‌ రాజంపేట ఎంపిగా ఆరు సార్లు విజయం సాధించారని తెలిపారు. ప్రస్తుతం టిడిపిలో ఉన్న ఆయన ఈ నెల 16న కడప కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇటీవల పార్టీ మార్పుపై మాట్లాడిన సాయిప్రతాప్ తాను… మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరలేదన్నారు. రాష్ట్ర విభజన తీరుతో మనస్తాపం చెంది కాంగ్రెస్‌ను వీడానని.. కాంగ్రెస్ పెద్దల పిలుపు మేరకు తిరిగి పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తనకు పదవులపై ఆశలేదని, చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సీమాంధ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సాయిప్రతాప్ వెల్లడించారు.





Untitled Document
Advertisements