ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో హాకీ టెస్టులో భారత పురుషుల జట్టుకు ఓటమి ఎదురైంది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 40 గోల్స్ తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఇంతకుముందు జరిగిన మూడు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధించింది. నాలుగో టెస్టులో మాత్రం భారత్ ఆశించిన స్థాయిలో ఆడలేక పోయింది. ప్రపంచ నంబర్2 ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో అసాధారణ ఆటను కనబరిచింది. భారత్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ మ్యాచ్ను సొంతం చేసుకుంది. ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా ఎటాకింగ్ గేమ్ను కనబరిచింది. వరుస దాడులతో భారత రక్షణశ్రేణికి ముచ్చెమటలు పట్టించింది. మరోవైపు భారత్ తీవ్ర ఒత్తిడిలో కనిపించింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సఫలమయ్యారు. స్టార్ ఆటగాళ్లు బ్లేక్ గోవర్, జెర్మి హేవార్డ్ రెండేసి గోల్స్ సాధించి ఆస్ట్రేలియాకు ఘన విజయం అందించారు. 15వ నిమిషంలోనే గోవర్ ఆస్ట్రేలియాకు మొదటి గోల్ అందించాడు. మరో ఐదు నిమిషాల తర్వాత జెర్మి జట్టుకు రెండో గోల్ సాధించి పెట్టాడు. తర్వాత భారత్ కాస్త దూకుడును పెంచింది. అయితే వరుస దాడులు చేసినా ఫలితం లేకుండా ప్రథమార్ధం ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 20 ఆధిక్యంలో నిలిచింది.
ద్వితీయార్ధంలో స్కోరును సమం చేసేందుకు భారత్ తీవ్రంగా శ్రమించింది. అయితే పటిష్టమైన డిఫెన్స్తో ఆతిథ్య జట్టు భారత దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఇక, ఆట చివర్లో ఆస్ట్రేలియా మరో రెండు గోల్స్ సాధించింది. 59వ నిమిషంలో గోవర్, 60వ నిమిషంలో జెర్మి గోల్స్ నమోదు చేశారు. దీంతో ఆస్ట్రేలియా 40తో జయకేతనం ఎగురవేసింది.