ఈ నెల 23న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ, కౌంటింగ్ కేంద్రాల్లో కూర్చునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజంట్లకు ఈ ఉదయం నుంచి అమరావతి ప్రాంతంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ ప్రారంభమైంది. వీరికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శిక్షణ ఇస్తుండటం గమనార్హం. మాజీ సీఎస్ అజయ్ కల్లం నేతృత్వంలో మరో రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ వారికి కౌంటింగ్ కేంద్రాల్లో వ్యవహరించాల్సిన తీరును వివరిస్తున్నారు.
వీరితో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా ఏజంట్లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజంట్లకు వివరిస్తున్నారు. ఈ ఉదయం నుంచి శిక్షణ ప్రారంభం కాగా, ఒంటిగంట వరకూ ఏంజట్ల విధులపైనా, ఆపై భోజన విరామం అనంతరం సాయంత్రం వరకూ మిగతా విషయాలపైనా శిక్షణ ఉంటుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.