ఈసీ నిర్ణయంతో పశ్చిమబెంగాల్ ప్రచారానికి రాత్రి 10 గంటలతో తెరపడనుండటంతో గురువారం నాడు బెంగాల్లోని రెండు సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. మధురాపూర్, డుమ్ డుమ్లలో ఆయన ప్రచారం చేస్తారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రధాని మాధురాపూర్ చేరుకుంటారు. సాయంత్రం 6.10 గంటలకు డుమ్డుమ్లో జరిగే ర్యాలీలో పాల్గొంటారు.
కోల్కతాలో మంగళవారం అమిత్షా రోడ్షో అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ బుధవారం నాడు కొరడా ఝళిపిచింది. బెంగాల్లో తొలిసారిగా ఆర్టికల్ 324ను ప్రయోగించింది. శుక్రవారం సాయంత్రంతో ముగియాల్సిన ఎన్నికల ప్రచారాన్ని మరో 24 గంటల ముందుగానే ఆపేయాలని ఆదేశాలిచ్చింది.
దీంతో తొమ్మిది నియోజకవర్గాల్లో....డుమ్డుమ్, బరసత్, బసిర్హట్, జేనగర్, మధురాపూర్, జాదవ్పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్ కోల్కతాలో నేటి రాత్రి 10 గంటలతో ప్రచారం ముగిసిపోతుంది. తుది విడత పోలింగ్ ఈనెల 19న జరుగనుంది.
కాగా, టీఎంసీ సీనియర్ నేతలు సీఎం జతువ మధురాపూర్, సౌగత్ రాయ్ డుమ్డుమ్ నుంచి మరోసారి ఎన్నికయ్యేందుకు పట్టుదలగా ఉన్నారు. ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల్లోనే ప్రధాని ఇవాళ ప్రచారం చేయన్నారు.