ప్రధాని మోదీని 'పని చేస్తున్నట్టు నటించే పెళ్లికూతురు'తో పోలుస్తూ మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఇండోర్లోని జిల్లా ఎన్నికల కార్యాలయం గురువారంనాడు క్లీన్ చిట్ ఇచ్చింది. సిద్ధూ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రావని స్పష్టం చేసింది.
సిద్ధూ ఇండోర్లో ఇటీవల ఎన్నికల ప్రచారం సాగిస్తూ, మోదీకి మాటలు ఎక్కువ, పని తక్కువ అని అర్ధమొచ్చే రీతిలో వ్యాఖ్యలు చేశారు. తక్కువ చపాతీలు చేసే పెళ్లికూతురు తన గాజుల మోతతో ఎక్కువ పని చేస్తోందనే భ్రమ కల్పించినట్టు మోదీ సర్కార్ పనితీరు ఉందని విమర్శించారు. సిద్ధూ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. మహిళలు రొట్టెలు చేయడానికే పరిమితం కాదని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారనే విషయం సిద్ధూకు తెలియదా అని నిలదీసింది. సిద్ధూ ఆ తర్వాత కూడా బీజేపీపై విమర్శల దూకుడు పెంచుతూ ఆ పార్టీ నేతలను 'నల్ల బ్రిటిషర్ల'తో పోల్చారు.