సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాల వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ తన ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఇంటర్ బోర్డులో అవకతవకలకు పాల్పడ్డ వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆఫీస్ నుంచి సీపీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మాట్లాడిన నారాయణ.. గ్లోబరీనా వల్లే 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. గ్లోబరీనా ఎండీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు అమ్ముడుపోవడం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో నిషేందించిన గ్లోబరీనాకు తెలంగాణలో అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.