ఈ రోజుతో దేశవ్యాప్తంగా చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండు నెలల పాటు దేశంలో నేతలు వారి వారి ప్రచారాలతో విస్తుగొలిపే మాటలతో ప్రజల్లో హోరెత్తించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం చివరి దశ పోలింగ్ జరగనుంది. యూపీలో 13, పంజాబ్లో 13, పశ్చిమబెంగాల్లో 9, బీహార్లో 8, మధ్యప్రదేశ్లో 8, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో ఒక స్థానానికి చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి.
అదేవిధంగా చివరి విడత ఎన్నికల బరిలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, మాజీ స్పీకర్ మీరాకుమార్, శిబూసోరెన్ వంటి నేతలు బరిలో ఉన్నారు.
కాగా చివరి దశ పోలింగ్ కావడంతో అన్ని పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పశ్చిమబెంగాల్లో టీఎంసీ, బీజేపీలు రెండూ కేడర్ ఉన్న పార్టీలు కావడంతో రెండూ ఎంతో పోటాపోటీగా రంగంలోకి దిగాయి. అమిత్షా, యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖుల ప్రచారానికి పశ్చిమబెంగాల్ సీఎం మమతా నిరాకరించడంతో హింస, అల్లర్లు చెలరేగాయి. అలాగే.. బీజేపీ అభ్యర్థి ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చివరి దశ ప్రచారంలోనే చోటు చేసుకున్నాయి. ఇక్కడ చివరి ట్విస్ట్ ఏమిటంటే... ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటాపోటీగా విలేకరుల సమావేశం నిర్వహించడంతో ప్రచార ఘట్టం ముగిసినట్లైంది.