వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా నూతన వలస విధానాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న గ్రీన్ కార్డులను బిల్డ్ అమెరికా వీసా పేరుతో మార్పు చేశారు. ఇప్పటిదాకా కుటుంబ సంబంధాల ఆధారంగా 66 శాతం, నైపుణ్యాల ఆధారంగా 12 శాతం గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో మాత్రం ప్రతిభకే పట్టం కట్టారు. నైపుణ్యాల ఆధారంగా ఇస్తున్న కోటాను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచారు. దీనివల్ల దశాబ్దాలుగా గ్రీన్కార్డులు దొరక్క, దినదినగండంగా కాలం నెట్టుకొస్తున్న వేలాది మంది భారతీయులు లాభపడనున్నారు. ప్రస్తుతం ఉన్న విధానాల ద్వారా నైపుణ్యవంతులకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాం. నూతన విధానం ఆమోదం పొందితే అలా జరిగే అవకాశం ఉండదు అని ట్రంప్ తెలిపారు.