అమెరికాలోని టెన్నీసీ కోర్టు వివాదాస్పద తీర్పునిచ్చింది. లెనార్ సిటీలోని ఓ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్న డేవిడ్ రిచర్డ్స్ అనే వ్యక్తి కేసులో ఈ తీర్పు వెలువడింది. 41 ఏళ్ల డేవిడ్ 14 ఏళ్ల తన కూతురికి రెండేళ్ల పాటు నరకం చూపించాడు. ఆమెను బలవంతంగా అనేకసార్లు బలాత్కరించాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చివరకు అతని కుమార్తె మీడియా ముందుకొచ్చి జరిగిన ఘాతుకం గురించి వెల్లడించే వరకూ ఎవరికీ ఈ ఘోరం గురించి తెలియదు.
బాధితురాలు అందరిముందూ తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినా.. చాలా మంది ఆమె మాటలను నమ్మలేదు. డేవిడ్ అలాంటి వ్యక్తి కాదంటూ నొక్కి వక్కాణించారు. సమాజానికి, అతని కుటుంబానికి, చర్చికి డేవిడ్ లాంటి వ్యక్తుల సేవలు అవసరమని, అతన్ని విడుదల చేయాలని కోర్టులో అప్పీలు చేశారు. కానీ చివరకు అతను దోషేనని తేలింది.
14 ఏళ్ల బాలికపై, అందునా సొంత కూతురిపై అత్యాచారం చేసిన డేవిడ్ను కఠినంగా శిక్షించాలని ప్రాసిక్యూటర్ వాదించారు. కానీ డేవిడ్ ఓ పాస్టరని, దేవుని సేవలో గడిపిన వాడని చెప్పిన జడ్జి.. నిందితుడికి కేవలం 12 ఏళ్ల సాధారణ జైలు శిక్ష వేశాడు. ఇటువంటి కేసుల్లో నిందితులకు కనీసం 72 సంవత్సరాల శిక్ష వేసే ఆస్కారం ఉంది. ఈ తీర్పు విన్న ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదికి దిమ్మతిరిగింది. అయితే తాను ఎటువంటి నేరమూ చేయలేదని బుకాయిస్తున్న డేవిడ్.. పైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేస్తున్నట్లు సమాచారం.