ఇంగ్లండ్లో జరగబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ ఆటకు గుడ్బై చెబుతాడనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అతడు విడుదల చేసిన వీడియో దీనికి ఊతమిచ్చినట్టుగానే కనిపిస్తోంది. రిటైర్ అయ్యాక తన చిన్ననాటి కల అయిన పెయింటింగ్ను కొనసాగిస్తాననే అతడి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఈ వీడియోలో తాను వేసిన మూడు పెయింటింగ్లను కూడా చూపించాడు. ‘మీ అందరికీ నేనో రహస్యం చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్ట్ కావాలనుకున్నా. ఇప్పటికే నేను చాలా క్రికెట్ ఆడాను. ఇక నా కోసం సమయం కేటాయించుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే నాకిష్టమైన పెయింటింగ్స్ వేశాను’ అని ధోనీ పేర్కొన్న వీడియో వైరల్గా మారింది.