ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే రానుందనే సంకేతాలివ్వడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం దూసుకుపోయాయి. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే సెన్సెక్స్ 1,421 పాయింట్లు పెరిగి 39,352 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ కూడా 3.7 శాతం (421 పాయింట్లు) పెరిగి 11,828 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో షేర్లు ర్యాలీకి నాయకత్వం వహించాయి.
డాలర్తో రూపాయి మారకపు విలువ కూడా బలపడింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి.బ్యాంకింగ్, ఆటో షేర్లు ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం, ఆటో ఇండెక్స్ 4 శాతం పెరిగాయి.సెన్సెక్స్ షేర్లలో ఎస్బీఐ 8 శాతం, యెస్ బ్యాంక్ 6 శాతం, ఎల్ అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి, టాటా స్టీల్ ఓఎన్జీసీ, ఆర్ఐఎల్లు 4 నుంచి 5 శాతం చొప్పున పెరిగాయి.
డాలర్తో రూపాయి మారకపు విలువ రెండు వారాల గరిష్టస్థాయికి చేరింది. శుక్రవారం ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకపు విలువ రూ. 70.23 వద్ద ముగియగా, సోమవారం అది రూ. 69.36 కి బలపడింది. బాండ్స్లో కూడా ర్యాలీ వచ్చింది. పదేళ్ల బాండ్ యీల్డ్ (ప్రతిఫలం) బెంచ్ మార్క్ అంతకు ముందు ముగింపుతో పోలిస్తే ఆరు పాయింట్లు తగ్గి 7.30 శాతం వద్ద ట్రేడవుతోంది.ఎన్డీఏ సీట్లు 300 కి మించితే, ఈ ర్యాలీ మే 23 తర్వాత కూడా కొనసాగుతుందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.